మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
ప్రతి మండలంలో మూడు రోజులపాటు సేవలు అందించనున్న మొబైల్ వ్యాన్
మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి చొరవతో వాహనం ఏర్పాటు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి చొరవతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ. 2 కోట్ల నిధులతో ఈ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాహనం కృష్ణా జిల్లా పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుంది. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వాహనంలో ఏడు రకాల పరికరాలు అమర్చారు. వారంలో మూడు రోజులపాటు ఒక మండల పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ అల్ట్రా సౌండ్, మొమోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్ రే, కెమికల్ అనాలసిస్, కొలస్కోపీ వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ సంచార క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40 వేల మరణాలు అరికట్టవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజల కోసం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిన భెల్ కంపెనీ ప్రతినిధులను, చొరవ చూపిన ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల శాసనసభ్యులు శ్రీ మండలి బుద్దప్రసాద్ గారు, శ్రీ వర్ల కుమార రాజా గారు, శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు, శ్రీ వెనిగెండ్ల రాము గారు, శ్రీ బోడే ప్రసాద్ గారు, శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి. కె. బాలాజీ గారు, రాష్ట్ర మెడికల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా జనసేన నాయకులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*