
సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం.. జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. ఇతరుల భూములు కబ్జా చేయకుండా కొత్త చట్టం తెచ్చామని, భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.
“మీ తాత, తండ్రుల కష్టార్జితం మీకే దక్కాలి. కబ్జా చేయాలనుకున్న భూమి కనిపిస్తే చాలు.. జైలు గుర్తుకు రావాలి. తప్పుడు సర్వేలు జరిగాయని లక్షల మంది ఫిర్యాదు చేశారు. సర్వే వల్ల సెంటు, రెండు సెంట్ల భూమి పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయి. భూమి గురించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం. భూమి కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లలో తేడాలు పరిష్కరిస్తాం. వారసుల పేర్లు సరిగా ఉండేలా చూస్తాం. అన్నీ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 95,200 పిటిషన్లు వచ్చాయి. జనవరి 9 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. సదస్సుల్లో ఇప్పటి వరకు 3లక్షల మంది పాల్గొన్నారు” అని సీఎం తెలిపారు.
Be the first to comment