
ప్రముఖ నటుడికి తెలంగాణ సర్కార్ షాక్..
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మకాలు ఇప్పటికే విచ్చలవిడిగా సాగుతున్నాయంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో దాన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.
ఈ క్రమంలో ప్రఖ్యాత నటుడు, గాయకుడు దిల్జిత్ దొసాంజ్కూ తెలంగాణ ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది. దిల్- లుమినాటి పేరుతో నేడు ఆయన మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించబోతోన్న నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కన్సర్ట్ నిర్వాహకులకూ నోటీసులు ఇచ్చింది.
మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ఎలాంటి పాటలను ఆలపించకూడదని ఆదేశించింది ప్రభుత్వం. హింసను ప్రేరేపించేలా, చిన్నారులపై ఆకృత్యాలకు సంబంధించిన పాటలనూ పాడకూడదని సూచించింది.
మ్యూజికల్ కన్సర్ట్, లైవ్ షో కొనసాగుతున్న సమయంలో చిన్న పిల్లలను వినియోగించుకోకూడదని, వారితో ఎలాంటి పనలనూ చేయించకూడదని దిల్జిత్ దొసాంజ్కు సూచించింది. చిన్న పిల్లలకు హాని కలిగించేలా ఫ్లాష్ లైట్లను వేయకూడదని, లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదని పేర్కొంది.
13 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 120 డెసిబల్స్కు మించిన శబ్దాన్ని వినకూడదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధలు స్పష్టం చేస్తోన్నాయని, దీనికి అనుగుణంగానే లౌడ్ స్పీకర్లను వాడుకోవాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.
కాగా- పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దొసాంజ్.. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో దిల్- లుమినాటి పేరుతో మ్యూజిక్ కన్సర్ట్, లైవ్ షోను నిర్వహించబోతోన్నారు. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్లో ఈ కన్సర్ట్ ఏర్పాటయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్లో గల జీఎంఆర్ ఎరీనాలో ఈ సాయంత్రం 6 గంటలకు ఈ కన్సర్ట్ ఆరంభమౌతుంది.
దీనికి టికెట్ ధర.. 3,999 నుంచి 19,900 రూపాయల వరకు నిర్ణయించారు నిర్వాహకులు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లల్లో ఈ కన్సర్ట్ను నిర్వహించారు దొసాంజ్. ఇప్పుడు భారత్లో దీన్ని ఏర్పాటు చేశారు. హర్యానా, ఢిల్లీల్లో ఈ కార్యక్రమం ముగిసింది.
Be the first to comment