Mumbai : భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇండియాపై సైబర్‌దాడులు

Mumbai: భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ ఇండియాపై సైబర్‌దాడులు ఇంకా కొనసాగుతున్నట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌లో 1.5 కోట్ల సైబర్‌ దాడులు చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. వీటిలో 150 విజయవంతమైనట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఈ దాడులు జరిగినట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 22 తర్వాత భారీస్థాయిలో డిజిటల్ దాడులు పెరిగాయని, భారత వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్‌, పశ్చిమాసియా, ఇండోనేసియా హ్యాకర్లు వీటికి పాల్పడినట్లు మహారాష్ట్ర సైబర్‌ నేరాల నియంత్రణ విభాగం సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. ‘‘హ్యాకర్లు ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన సమాచారాన్ని దొంగిలించారు. విమానయానం, మున్సిపల్ సిస్టమ్స్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకొని హ్యాకర్స్‌ దాడులు చేశారు. భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ తర్వాత కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌పై సైబర్‌ దాడులు పూర్తిస్థాయిలో తగ్గలేదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, మొరాకో, పశ్చిమాసియా దేశాల నుంచి సైబర్‌ దాడులు ఎదురవుతూనే ఉన్నాయి’’ అని సదరు అధికారి తెలిపారు.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో సైబర్ డిపార్ట్‌మెంట్‌ నోడల్ కార్యాలయంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తూ.. సైబర్ నేరాల దర్యాప్తు, భద్రతా నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. సైబర్‌ దాడులకు గురైతే బాధితులు 1945, 1930 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*