ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (చీఫ్‌ సెక్రటరీ)G.సాయిప్రసాద్‌

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (చీఫ్‌ సెక్రటరీ)G.సాయిప్రసాద్‌

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (చీఫ్‌ సెక్రటరీ) సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి G.సాయిప్రసాద్‌ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఒకే చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. సాయిప్రసాద్‌ ప్రస్తుతం జనవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఛీప్‌ సెక్రటరీ (CS)గా ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. 4 నెలల క్రితమే ఆయన రిటైరయినా సర్వీసును పొడిగించి కొనసాగించారు. మరోసారి ఆయన సర్వీసును పొడిగిస్తారనే ప్రచారం జరిగినా చివరికి ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

CS పదవి కోసం చాలామంది సీనియర్‌ IAS అధికారుల పేర్లను చంద్రబాబు పరిశీలించారు. కొందరైతే ఆయనపై రకరకాల లాబీయింగ్‌ల ద్వారా ఒత్తిడి కూడా తెచ్చారు. RP.సిసోడియా, K.విజయానంద్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఒక దశలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సిసోడియా CS అవడం ఖాయమని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన సీఎం మనసుకు తగ్గట్టు వ్యవహరించారు. ఆ తర్వాత విజయానంద్‌ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే అదానీతో ముడిపడిఉన్న విద్యుత్‌ ఒప్పందాల్లో ఆయనే కీలకంగా ఉండడంతో విజయానంద్‌కు అవకాశాలు మూసుకుపోయాయి. సిసోడియా కూడా భూములకు సంబంధించిన పలు వ్యవహారాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు బయటపడింది. దీంతో సొంత మనిషిగా ఉన్న సాయి ప్రసాద్‌వైపై చంద్రబాబు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాయిప్రసాద్‌ చీఫ్‌ సెక్రటరీ అవ్వాల్సివుంది. కానీ ఆయన గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ వంటి వాటిని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించడం, దాన్ని కూటమి వ్యతిరేకించడం సాయిప్రసాద్‌కు ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు సాయిప్రసాద్‌ అయితేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన చంద్రబాబుకు అత్యంత దగ్గర వ్యక్తిగా చెబుతారు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్‌ దాడి చేసినప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సాయిప్రసాద్‌ ఆయన పక్కనే ఉన్నారు. చంద్రబాబు కుటుంబంతో దూరపు బంధుత్వం కూడా ఉంది. 2014–19 మధ్య సీఎం ఆఫీసు కార్యదర్శిగా కీలకంగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయన్ను దూరం పెట్టినా పనితీరు ఆధారంగా రెవెన్యూ శాఖను అప్పగించింది. ఆ శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చి భూముల రీ సర్వే, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ వంటి క్లిష్టమైన పనులను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం ఆయన్ను అనుమానించి పక్కనపెట్టినా పనితీరే కొలమానంగా ఆయనకు చీఫ్‌ సెక్రటరీగా నియమించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*