యోగా డే తో రాష్ట్రఖ్యాతి ఇనుమడిస్తుంది: ప్రత్తిపాటి
– యోగా దినోత్సవ నిర్వహణపై మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మాజీమంత్రి ప్రత్తిపాటి
అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణతో రాష్ట్ర ఖ్యాతి ఖండాంతరాల్లో ఇనుమడిస్తుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ యోగాంధ్ర కార్యకలాపాల బాధ్యతలు ప్రభుత్వం ప్రత్తిపాటికి అప్పగించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఆయన విశాఖపట్నంలోనే ఉండి యోగా డే నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ సందర్భంగా బుధవారం మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్ష సమావేశానంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చక్కటి సమన్వయంతో సీఎం ఆలోచనలకు కార్యరూపమిచ్చినట్టు ప్రత్తిపాటి తెలిపారు. 21న సాగర తీరాన జరిగే యోగా వేడుకతో నవ్యాంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ యోగాడే కు హాజరయ్యే వారు అధికారయంత్రాంగం సూచనల ప్రకారం నడుచుకొని, కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగనివిధంగా విజయవంతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. విశాఖపట్నం నగరవాసులందరూ ఈ కార్యక్రమంలో భాగమై, భారీ స్థాయిలో విజయవంతం చేయాలన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి 583 బస్సుల ద్వారా 26 వేల మంది కార్యక్రమానికి వచ్చేలా చూడాలని మంత్రి నారాయణ సూచించినట్టు ప్రత్తిపాటి తెలిపారు. యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇతర ప్రముఖులు హాజరవుతున్నoదున కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేసినట్టు, 326 కంపార్ట్మెంట్లకు గాను, 2,000 సీసీటీవీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్లు అమర్చినట్టు ప్రత్తిపాటి తెలియచేశారు. సమీక్ష సమావేశంలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, మాజీ ఎమ్మెల్సీ రాజు, నజీర్, ఉషా కిరణ్ , సురేష్ బాబు, జోనల్ కమిషనర్లు రాము, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment