బాల సరస్వతి ఇదేళ్ల వయసులోనే బాల నటిగా నటించారు
అఖిల భారత బలిజ, కాపు కళాకారులు, క్రీడాకారులు, కళారాధకులు ( కళాపోషకులు ): సురభి బాలసరస్వతి : శ్రీకాకుళం జిల్లా పొందూరు గ్రామానికి చెందిన బాల సరస్వతి ఇదేళ్ల వయసులోనే బాల నటిగా నటించారు. ” గోవిందరాయ నాట్యమండలి” లో బాలనటిగా ప్రవేశించారు. యుక్త వయసులోకి అడుగుపెట్టాక ” రాణి ప్రమీల ” నాటకంలో నాయకి ప్రమీల పాత్ర వేసి మంచి పేరు సంపాదించారు. ” అమెచ్యూర్స్ ” అనే నాటక సంస్థలో సాంఘిక నాటకాల్లో పురుష పాత్రలు ధరించి ఒక వెలుగు వెలిగారు. తొలి తెలుగు కధానాయిక సురభి కమలాబాయి (పాతాల భైరవి లో ఎన్. టి. ఆర్. తల్లి ) ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రవేశించారు. కోన ప్రభాకరరావు ( ఈయన ఏ. పి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పని చేశారు ) దర్శకత్వం వహించిన ” రూపవతి ” ( 1951 ) సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆమెకు హీరోయిన్ గా తొలి సినిమా చివరి సినిమా కూడా అదే. తరువాత ఎక్కువగా కామెడీ పాత్రలకు పరిమిత మయ్యారు. అక్కినేని అనార్కలిలో లేడీ విలన్ గా నటించారు. పల్నాటి యుద్ధం, ద్రోహి, మనదేశం ( ఎన్టీఆర్ మొదటి సినిమా ), లైలా మజ్ను చిత్రాలలో నటించారు. పై నున్న ఛాయా చిత్రం 1954 లో వచ్చిన ‘ పరివర్తన ‘ సినిమాలోది. సంసారం, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, ప్రమీలార్జునీయం, చిత్రాలలో నటించారు. ఆనాటి ప్రముఖ హాస్యనటులైన రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, చదలవాడ కుటుంబరావులకు జోడీగా నటించారు. చిత్ర పరిశ్రమ నుండి నిష్క్రమించినాక సొంత నాటక సమాజం నెలకొల్పి తారా శశాంకం లో తార గా నటించి అనేక ప్రదర్శనలిచ్చారు. ఈ నాటకంలో శంకరాభరణం ఫేమ్ జే. వి. సోమయాజులు చంద్రుడుగా నటించేవారు. రంగ స్థలం పై, వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సురభి బాలసరస్వతి 10.11.1983 న నెల్లూరు జిల్లా గూడూరులో మరణించారు.
సేకరణ : బుడగాల సుబ్బారావు


Be the first to comment