జంతువులను అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) హెచ్చరించారు. ఎవరైనా జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తిస్తే కంట్రోల్ రూమ్ నంబర్ 8712661155కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు బషీర్బాగ్ కార్యాలయంలో గురువారం పలు గోసేవా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జంతువులను చంపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోరక్షకులు చట్టానికి లోబడి ఉండాలన్నారు. ఆవులను, ఇతర జంతువులను రక్షించడానికి పనిచేస్తున్నామని గోసేవా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కొందరి మనోభావాలు దెబ్బతినే విధంగా పశువులను చంపుతున్న వీడియోలను తీసి రీల్స్గా పెడుతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో అదనపు సీపీ విక్రం సింగ్మాన్, డీసీపీలు, ఏసీపీలు, యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్, తెలంగాణ గోరక్షక్దళ్ ప్రెసిడెంట్ దీపక్ సింగ్, అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఏ. బాలకృష్ణ, భారతీయ ప్రాణిమిత్రసంఘ్ ప్రెసిడెంట్ శ్యామల్, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జస్మిత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.


Be the first to comment