దేశంలో గుడి-మసీదు వివాదాలకు సుప్రీం బ్రేక్-కీలక ఆదేశాలు..!
దేశంలో రామజన్మభూమి వివాదం తర్వాత కేంద్రం తీసుకొచ్చిన ప్రార్ధనా స్థలాల పరిరక్షణ చట్టం అమల్లో ఉన్నా దాన్ని ఉల్లంఘించి స్ధానిక కోర్టులు మందిరం-మసీదు వివాదాలపై ఇష్టారాజ్యంగా ఆదేశాలు ఇస్తున్న వ్యవహారంపై సుప్రీంకోర్టు స్పందించింది.ప్రార్ధనా స్థలాల పరిరక్షణ చట్టం ప్రకారం 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఉన్న ప్రార్ధనా స్థలాలను ఎలాంటి మార్పులు చేయకుండా పరిరక్షించాల్సి ఉంది. కానీ స్థానిక కోర్టులు ఇస్తున్న ఆదేశాలు, సర్వేలతో దీనికి భంగం కలుగుతోందని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు పీవీ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులను వారి మతపరమైన స్వభావాన్ని వివాదాస్పదం చేసే కేసులలో ప్రస్తుత మతపరమైన నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేయవద్దని లేదా సర్వేలు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రార్థనా స్థలాల చట్టం 1991కి ఉన్న రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచ్..చట్టాన్ని సవాలు చేసే పిటిషన్లను విచారించి పరిష్కరించే వరకు అటువంటి నిర్మాణాల నిర్మాణాల మతపరమైన స్వభావానికి సంబంధించి కొత్త వాజ్యాలు నమోదు చేయరాదని ట్రయల్ కోర్టుల్ని ఆదేశించింది. సుప్రీంకోర్టులో ప్రార్ధనా స్థలాల చట్టంపై విచారణ జరుగుతున్నట్లు కింది కోర్టులు ఇలా ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
ప్రార్ధనా స్థలాల చట్టం రాజ్యాంగ బద్ధత విషయంలో కేంద్రం ఇంకా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు తనకు సమయం కావాలని అన్నారు. దీంతో నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.ప్రస్తుతం యూపీలోని సంభాల్లో ఉన్న షాహీ జామా మసీదు, వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాపై వివాదాలు ఉన్నాయి.


Be the first to comment