తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన స్పష్టత ఇచ్చింది.

తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని ప్రభుత్వం నిశ్చయించింది. కేసును మళ్లీ తిరగదోడే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని సర్కార్ తేల్చిచెప్పింది.

ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ జారీ అయిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. అంతేకాకుండా, ఏ స్థాయిలో, ఎవరి ఆమోదంతో ఈ అప్పీల్ ఫైల్ ముందుకు నడిచిందనే విషయంపై సమగ్రంగా ఆరా తీయాలని కూడా ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది.

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, ఆర్‌పీజీ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానే అప్పీల్ కోసం గతంలో ఉత్తర్వులు వెలువడినట్లు ప్రభుత్వం గుర్తించింది. భవిష్యత్తులో ఇటువంటి చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇటువంటి ప్రతిపాదనలు, చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

అప్పీల్‌కు వెళ్లాలన్న పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ అధికారికంగా జీవో త్వరలోనే వెలువడనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ తాజా నిర్ణయంతో తుని కేసుకు సంబంధించి కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*