పార్లమెంట్లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ” త్రీ లైన్ విప్” జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
” వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు”కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ”త్రీ లైన్ విప్” జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ”వన్ నేషన్-వన్ ఎలక్షన్” బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఎంపీలకు ”త్రీ లైన్ విప్” జారీ చేసింది. డిసెంబర్ 13-14 తేదీల్లో సభకు తప్పకుండా హాజరవ్వాలని కోరింది. ఈ రెండు రోజుల్లో భారత రాజ్యాంగంపై చర్చ జరగనుంది. డిసెంబర్ 13-14న లోక్సభలో, డిసెంబర్ 16-17 వరకు రాజ్యసభలో చర్చ ఉండనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో చర్చ ప్రారంభించే అవకాశం ఉంది. లోక్సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లోని ఉభయసభల్లో చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో సభానాయకుడిగా ఉండగా, రాజ్నాథ్ సింగ్ లోక్సభలో డిప్యూటీ లీడర్గా ఉన్నారు. డిసెంబర్ 14న లోక్సభలో రాజ్యాంగంపై చర్చకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం ఇస్తారని విశ్వసనీయ సమాచారం.
మరోవైపు ”వన్ నేషన్ వన్ ఎలక్షన్” బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. ఈ రోజు బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏక కాలంలో 100 రోజలు వ్యవధిలో పట్టణ-పంచాయతీ ఎన్నికలతో సహా రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లుని పీఎం మోడీ ప్రశంసించారు. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పెంపొందిచే దిశగా ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.


Be the first to comment