నేటి పంచాంగం విశేషాలు

నేటి పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 29 – 11 – 2024,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,

తిథి : త్రయోదశి ఉ7.48 వరకు,
నక్షత్రం : స్వాతి ఉ10.20 వరకు,
యోగం : శోభన సా5.19 వరకు,
కరణం : వణిజ ఉ7.48 వరకు,
తదుపరి భద్ర రా8.41 వరకు,

వర్జ్యం : సా4.27 – 6.12,
దుర్ముహూర్తము : ఉ8.28 – 9.13,
మరల మ12.10 – 12.54,
అమృతకాలం : రా2.56 – 4.41,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండం : మ3.00 – 4.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.16,
సూర్యాస్తమయం: 5.20,

*_నేటి విశేషం_*

*మాసశివరాత్రి*
అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం.
శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.

మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది.

మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి…
దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి, అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు.

అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.

ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి.

మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.
మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి, దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి.

ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.

శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి.
దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు,
తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

*అసలు ఈ రోజున ఏం చేయాలి ?*

🌸శివుడికి ఈ రోజును ప్రీతి పాత్రమైన రోజుగా చెపుతారు. ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు చేయడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి అని ప్రతీతి. ఉదయం కాని సాయంకాలం శివునికి అభిషేకం చేయాలి. తరువాత పాయసాన్ని నివేదన చేయాలి.

🌿ఉపవాసం ఉండదలచిన వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేస్తూ సాయంకాలం ప్రదోష సమయంలో శివునికి అభిషేకం చేయాలి. విష్ణువుకి అలంకారం అంటే ప్రీతి. శివునికి అభిషేకం అంటే ప్రీతి. కావున శివునికి రుద్రంతో కాని, నమక, చమకాలతో కాని ఈ రోజున అభిషేకం చేయాలి.

🌸అలాగే ప్రదోష పూజలు అన్నా కూడా శివుడికి చాలా ప్రీతికరం.
అభిషేకానంతరం, బిల్వాష్టోత్తరం చెపుతూ బిల్వ దళాలను శివునికి అర్పించాలి, ఇవి ఏవీ చేయకున్నా కనీసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయను జపించడం కూడా మంచిది.

🌿 ఎవరి స్తోమతను అనుసరించి వారు పరిహారాలు చేసుకోవాలి.

ప్రదోషకాలంలో శివుడు తాండవం చేస్తూ ఉంటారని పురాణ వచనం.
ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పడుతూ ఉంటే
శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఒకేచోట ఈ సమయంలో ఉంటారని చెపుతారు.

🌸కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది.
అందువలన మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి.

🌿ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రినాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు…

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*